త్యాగాలు ప్రజలవి – భోగాలు నాయకులవి | Telugu News

త్యాగాలు ప్రజలవి – భోగాలు నాయకులవి

ఇప్పుడు కాదు ఎమర్జెన్సీ సమయం నుంచి మనం రాజకీయాలను చూస్తూనే ఉన్నాం..!!
ఇందిరాగాంధీ మొదలుకొని తదుపరి వచ్చిన మురార్జీ, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, వీపీ సింగ్ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు చెప్పే ఒక స్టాక్ డైలాగ్ “ప్రజలు త్యాగాలు చెయ్యాలి” అని..!!

నిజమే.. ప్రజలు త్యాగాలు చెయ్యాలి.

తమకు వచ్చే వంద రూపాయల గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలి. నాయకులు మాత్రం తమకు లభించే ఏ సబ్సిడీని వదులుకోరు. బయట 200 రూపాయలు ఉండే బిర్యానిని
వారు మాత్రం ఇరవై రూపాయలకే ఆరగిస్తారు.ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అనుభవిస్తారు..ప్రజలు చచ్చి చెడి తమ కష్టార్జితంలో నుంచి నానా తిప్పలు పడి అధిక చార్జీలు చెల్లించి ప్రయాణాలు చేస్తారు.నాయకులు మాత్రం విమానాలలో
ఉచితంగా ప్రయాణాలు చేస్తారు..
లక్ష రూపాయలుగా ఉన్న తమ వేతనాలను అమాంతం నాలుగు లక్షలకు పెంచుకుంటారు.. తమ నియోజకవర్గాలలో ప్రజాధనంతో.. సమకూర్చిన వాహనాలలో దర్జాగా ప్రయాణిస్తారు.. బస్సుల్లో, రైళ్లలో, విమానాలలో తమకు లభించే ఏ విధమైన రాయితీని విసర్జించరు.

ప్రజలు మాత్రం త్యాగాలు చెయ్యాల్సిందే..!!

మీకు చిన్న చిన్న రోగాలు వస్తే ప్రజల డబ్బుతో విదేశాలు వెళ్లి వైద్యాలు చేయించుకుంటారు..!! ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులలో ఛీత్కారాలు భరిస్తూ ఒక్కో బెడ్ మీద ముగ్గురు పేషేంట్స్ తో పడుకోవాలి.. లేదా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇల్లూ వాకిళ్ళు,పొలాలు పుట్రలు అమ్మేసుకుని దివాళా తీయాలి..
.
అవును మరి.. ప్రజలు త్యాగాలు చెయ్యాలి..!!
.
గత రెండురోజులు గా సోషల్ మీడియాలో చాలామంది దేశభక్తులు కొత్త లాజిక్స్ ను పోస్ట్ చేస్తున్నారు.
“మీరు తిరుపతి, శ్రీశైలం, షిరిడీ వెళ్ళినప్పుడు..రైల్వే స్టేషన్స్ లో టికెట్స్ కోసం ఏడెనిమిది గంటలు నిల్చోవడం లేదా..?? ATM ల దగ్గర గంటసేపు నిలుచోలేరా..?? ”
అని అంటున్నారు..!!
.
నిజమే…!!
.
సామాన్య ప్రజలు గంటల తరబడి నిలుచుని తమ సమయాన్ని త్యాగం చేస్తారు..!!
మరి నాయకులు..??
తిరుపతిలో, షిరిడీ లో ఏనాడైనా క్యూలలో నించున్నారా..?? మహాద్వారం నుంచి మహారాజుల్లా తమ కుటుంబాలతో సహా గర్భగుడి వరకు దూసుకుని పోతారేం.??
దేవుడితో అరగంటసేపు గడుపుతారు.. శేషవస్త్రాలు, ప్రసాదాలు స్వీకరిస్తారు.. ప్రత్యేక ఆశీర్వచనాలు తీసుకుంటారు..!!

మరి వారు ఎందుకు త్యాగం చెయ్యరు..??

ఒక నాయకుడికి అధికారం ఇచ్చింది దేనికి..??
ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందిస్తారు అనేగదా..??
నేను కొత్త సంస్కరణలు తీసుకువస్తాను. మీరు ఓపిక పట్టండి అని చెప్పని నాయకుడు ఎవరైనా గతంలో ఉన్నారా..??
ఆర్ధిక సంస్కరణల ఫలితాలు. రెండు ఏళ్లలో కనిపిస్తాయి…వస్తువులు చౌకగా లభిస్తాయి.. ప్రజలు త్యాగాలకు సిద్ధపడాలి అని PV నరసింహారావు గారు చెప్పారు..
ఆ తరువాత వాజపేయి..మన్మోహన్ కూడా ఇదే పాట పాడారు..
ఇరవై ఏళ్ల తరువాత కూడా వాటి ఫలితాలు పూర్తిగా కనిపించాయా..?? దేశంలో పేదరికం నలభై ఏళ్ళక్రితం 70 శాతమే ఉన్నది..ఇప్పుడూ అంతే ఉన్నది..!!
.
ప్రజలు మాత్రం త్యాగాలు చేస్తూనే ఉన్నారు..!!
.
పాత నోట్ల రద్దు ద్వారా నల్లధనం బయటకి తీయవచ్చు అని మోడీ భావించారు.. బాగుంది. మనం కూడా హర్షించాము. కానీ మోడీ ఊహించిన విధంగా జరుగుతున్నదా..??
దేశంలో 18 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉన్నది అని కేంద్రం చెప్తున్నది..!!
గత మూడు రోజుల్లో బయటకి వచ్చింది కేవలం యాభై మూడు వేలకోట్ల రూపాయలు మాత్రమే..!!

డిసెంబర్ చివరినాటికి రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే వెలికి వచ్చే అవకాశం ఉన్నదని నేడు ఆర్ధిక శాఖ అధికారులు చెప్తున్నారు. మరి ఈ సంస్కరణ ద్వారా ఫలితం లేకపోతే ప్రధాని తన చర్యకు మూల్యం చెల్లిస్తారా..??
.
పైగా మరో విచిత్రమైన సంగతి ఏమిటంటే.. ఈ నిర్ణయం మంత్రివర్గం సమావేశంలో
తీసుకుని ప్రధాని బయటకి వెళ్లి రాష్ట్రపతిని కలిశారు.
టీవీలో లైవ్ ఇచ్చి ప్రకటించారు.. అప్పటివరకు మంత్రులు అందరిని సమావేశ హాల్ లోనే బంధించేశారు..!!
.
ఎందుకయ్యా అంటే.. మంత్రులు బయటకి వెళ్తే ఈ నోట్ల రద్దు విషయం లీక్ అవుతుందని భయం అంట..!! ఎంత దారుణం..??
అంటే..తన మంత్రుల మీద తనకే నమ్మకం లేదన్న మాట. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అత్యంత గోప్యం.. ఈ రహస్యాలు కాపాడుతారని నమ్మకం మోడీ గారికి
తన మంత్రులమీద లేనప్పుడు అలాంటివారిని మంత్రివర్గంలో కొనసాగించడం ఎంతవరకు సమంజసం..??
ఇది మంత్రులకు..మీకు..ప్రజలకి అవమాసం కాదా..??
అంటే మోడీ గారికి తన మంత్రుల మీదే నమ్మకం లేనట్టే కదా..!!
.
మన చిన్నప్పటినుంచి వింటున్న మరో గొప్ప ఆణిముత్యం ఏమిటంటే..
“ఈ దేశం నీకేమి ఇచ్చిందని అడగకూడదు…
ఈ దేశానికి నువ్వు ఏమిచ్చావు..??” అని..
.
ఎందుకు ఇవ్వడం లేదు..??
.
నాకొచ్చే జీతం లో నలభై శాతం వివిధ పన్నుల రూపం లో కడుతున్నాను..!!
అదికాక బయట ఏ వస్తువు కొన్నా సర్వీస్ టాక్స్, స్వచ్ భారత్ టాక్స్, కృషి కళ్యాణ్
టాక్స్ కలిపి పదిహేను శాతం కడుతున్నా. అనగా నా ఆదాయంలో సగభాగం నేను దేశానికి ఇస్తున్నా. పొట్టపొడిస్తే అక్షరం ముక్కరాని వారిని కూడా
ఈ దేశం మంత్రులను చేసింది. మీరు వేలకోట్ల అవినీతి సొమ్మును కొల్లగొడుతున్నా భరిస్తున్నది మాలాంటి వాళ్ళే. ఇరవై రెండు ఏళ్లపాటు వివిధ విద్యాలయాలలో చదివి ఎంతో జ్ఞానం సంపాదించుకుని గుమాస్తాలుగా ఎద్దుల్లా చాకిరీ చేస్తున్నాము.
.
నాయకులకు ఒక సామాన్యుడు వేస్తున్న సూటి ప్రశ్న..!!
“ఈ దేశం మీకు చాలా ఇచ్చింది. మీరు ఈ దేశానికి ఏమి ఇచ్చారు..??” అని.
.
జవాబు ఉందా మీ దగ్గర..??

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts