2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!! | Telugu News

2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!

నగదు రహితమే మోడీ సర్కారు అసలు లక్ష్యమా?
నల్ల కుబేరులకు చెక్‌ చెప్పడానికి నగదు రహిత వ్యూహాన్ని రచించిన ప్రధాని
వచ్చే ఏడాది జూన్‌లో 2000 నోటు కూడా రద్దు కానుందా!? కేవలం 500.. ఆలోపు నోట్లు మాత్రమే అమల్లో ఉంటాయా!?
ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే జవాబు ఇస్తున్నాయి విశ్వసనీయ వర్గాలు. నల్ల ధనం కట్టడిలో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే 2000 నోటును కూడా ఉపసంహరించాలని కేంద్రం యోచిస్తోందంటున్నాయి. వాస్తవానికి, పెద్ద నోట్ల రద్దుకు, 2000 నోటు ముద్రణకు సంబంధం లేదని, ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా ముందే 2000 నోటును ప్రవేశ పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారని ఆ వర్గాలు వివరిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న వెంటనే 500 నోట్ల కంటే 2000 నోట్లు పెద్ద ఎత్తున మార్కెట్లోకి రావడానికి కారణం కూడా ఇదేనని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం 4 నోట్ల ప్రింటింగ్‌ ప్రెస్‌లు ఉంటే.. ఒక్క దానిలోనే 2000 నోట్ల ప్రింటింగ్‌ జరుగుతోందని తెలిపాయి.

500 నోట్లూ పరిమితమే!!
కొంత కాలంపాటు 500 నోట్లను కూడా పరిమితంగానే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2000 నోటును కూడా రద్దు చేసిన తర్వాతే 500 రూపాయల నోట్లు యథావిధిగా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పక్కా వ్యూహం ప్రకారమే 500 నోట్ల ముద్రణను నియంత్రిస్తున్నారని వివరించాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువరించిన మర్నాటి నుంచే ఆర్బీఐ 2000 నోటును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీంతో నల్ల కుబేరులంతా పాత నోట్లను కొత్త 2000 నోటు రూపంలోకి మార్చుకున్నారు. జూన్‌లో 2000 నోటును రద్దు చేస్తే, నల్ల కుబేరులంతా మళ్లీ 500 నోట్లలోకి మార్చేసుకుని దాచుకుంటారు. ఇదే పరిస్థితి కొనసాగితే, నల్ల ధనాన్ని బయటకు రప్పించడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే, నల్ల ధనం నియంత్రణకు 500 నోట్లను పరిమితంగా ముద్రించడమే మేలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. 2000 నోటును కూడా రద్దు చేసేసిన తర్వాత, 500 నోట్లను పూర్తి స్థాయిలో విడుదల చేస్తారని వివరిస్తున్నారు. నిజానికి, 500 నోట్ల కొరత తీరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. నోట్ల రద్దు అనంతర పరిణామాల్లో 500 నోట్లను తిరిగి భర్తీ చేయాలంటే 8.3 లక్షల కోట్ల రూపాయలను మార్కెట్లో ప్రవేశపెట్టాలి. ఇందుకు 1660 కోట్ల నోట్లను ముద్రించాల్సి ఉంది.

అయితే, నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌లో 500, 100, 50 నోట్లు అన్నీ కలిపి రోజుకు మొత్తం 2.2 కోట్ల నోట్లను మాత్రమే ముద్రిస్తున్నారు. నవంబరు 11 నుంచి 11 రోజుల్లో మొత్తం 16.1 కోట్ల నోట్లను ముద్రించి ఆర్బీఐకి అందజేశారు. వాటిలో 500 నోట్లు 2.9 కోట్లు మాత్రమే. వంద నోట్లు 8.5 కోట్లు కాగా, 4.7 కోట్ల 20 నోట్లు ముద్రించారు. మైసూర్‌, సాల్బోనీ, దేవాస్‌ ప్రెస్‌ల్లో కూడా 500 నోట్లను ముద్రిస్తున్నారు. మొత్తం అన్నిట్లోనూ కలిపినా, రోజుకు దాదాపు రూ.3000 కోట్ల విలువైన 500 నోట్లను ముద్రిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 కోట్ల నోట్లను ముద్రించాలని నాసిక్‌ ప్రెస్‌కు టార్గెట్‌ ఇచ్చారు కూడా. అంటే, వాటి విలువ రూ.20 వేల కోట్లు. ఈ లెక్కన మొత్తం అన్ని ప్రెస్‌ల్లోనూ కలిపి 500 నోట్లను పూర్తి స్థాయిలో ముద్రించడానికి కనీ సం ఆర్నెల్లు పడుతుంది. గతంలో రెండు షిఫ్టుల్లోనే పని చేసే వారు. ఇప్పుడు మూడు షిఫ్టుల్లోనూ నిరంతరాయంగా నోట్లను ముద్రిస్తూనే ఉన్నారు.

గతంతో పోలిస్తే 35 శాతం ఉత్పత్తి పెరిగింది. అయినా, 500 నోట్లను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకు రావాలంటే 6 నెలలు పడుతుంది. అంటే, జూన్‌లో 2000 నోటును రద్దు చేసే నాటికి 500 నోట్ల ముద్రణను పూర్తి చేస్తారని, 2000 నోటును రద్దు చేసి, దాని గడువు ముగిసిన తర్వాత 500 నోట్లను పూర్తి స్థాయిలో విడుదల చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో, వెయ్యి నోటును ఇక తీసుకొచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కూడా ఆ వర్గాలు తెలిపాయి. అంటే, వచ్చే జూన్‌ వరకూ ప్రజలకు నోట్ల కష్టాలు తప్పదనే అభిప్రాయాన్ని ఆ వర్గాలు వ్యక్తం చేశాయి. కాగా, నోట్లను పరిమితంగా విడుదల చేస్తూనే.. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తారు. బలవంతంగానే ప్రజలు డిజిటల్‌ లావాదేవీలకు వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితి కల్పిస్తారు. జనవరి తర్వాత ప్రజలు నగదు రహిత లావాదేవీలకు అలవాటు కావడం ప్రారంభం అవుతుంది. జూన్‌ నాటికి ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో కొలిక్కి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆ వర్గాలు వివరించాయి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts